మన భారత్, ఆదిలాబాద్:
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన పాటిల్ అనీల్ ఘటనపై ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మృతదేహాన్ని మార్చురి వద్ద ఉంచిన సమయంలో మాజీ సర్పంచ్ క్రీష్ణ, ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి, మృతుని బంధువులు, మిత్రులు కలిసి ట్రాన్స్కో SE, CI అధికారులతో చర్చలు జరిపారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ, విద్యుత్ శాఖ నిర్లక్ష్యం వల్లే ఈ విషాద ఘటన చోటుచేసుకుందని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, మృతుని కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.
మాజీ సర్పంచ్ క్రిష్ణ రత్న ప్రకాష్ మాట్లాడుతూ, గ్రామాల్లో విద్యుత్ భద్రతపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమస్యలపై ముందస్తు చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులదని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి కూడా మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని, అవసరమైన సహాయం వెంటనే అందించాలని అధికారులను కోరారు.
ట్రాన్స్కో అధికారులు స్పందిస్తూ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు ఉంటాయని తెలిపారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. స్థానికులు పెద్ద సంఖ్యలో మార్చురి వద్దకు చేరుకుని మృతునికి నివాళులు అర్పించారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
