మన భారత్, నారాయణపేట:
నారాయణపేట జిల్లాలో అవినీతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జిల్లా ఆర్డీఓ రామచందర్ నాయక్ మంగళవారం రూ.25 వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటనతో జిల్లాలో కలకలం రేగింది.
ఏసీబీ డీఎస్పీ సీ.హెచ్ బాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. లంచం స్వీకరిస్తున్న సమయంలో పట్టుబడిన రామచందర్ నాయక్పై కేసు నమోదు చేసి, తదుపరి చర్యలు ప్రారంభించారు.
ఈ కేసుతో సంబంధంగా నారాయణపేట జిల్లా కేంద్రంలోని బాబా కాలనీలో ఉన్న నివాసం, కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాకుండా, ఆయన గతంలో పనిచేసిన ప్రాంతాల్లో కూడా అవినీతి ఆరోపణలు ఉన్నట్లు సమాచారం.
గద్వాల జిల్లాలో ఆర్డీఓగా విధులు నిర్వహించిన సమయంలో లేని భూములకు ఓఆర్సీలు మంజూరు చేసి భారీగా డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ అంశాలపై కూడా ఏసీబీ అధికారులు సమగ్రంగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పలు జిల్లాల్లో పనిచేసిన సమయంలో జరిగిన లావాదేవీలపై సంబంధిత అధికారుల నుంచి నివేదికలు కోరినట్లు సమాచారం.
అలాగే, బినామీ పేర్లతో అక్రమ ఆస్తులు కూడబెట్టిన అనుమానంతో ఆయనకు అనుబంధంగా ఉన్న వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశముంది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
