మన భారత్, హైదరాబాద్:
హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యలను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలపై ఆలోచిస్తోంది. నగరవ్యాప్తంగా నడిచే ఎంఎంటీఎస్ రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించే ప్రతిపాదన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మహిళలు, పురుషులు అనే తేడా లేకుండా అందరికీ ఉచిత ప్రయాణం అందించే దిశగా ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.
ఈ పథకాన్ని జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ప్రారంభించేలా చర్యలు వేగవంతం చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్, కాలుష్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయానికి మొగ్గుచూపినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. సామాన్య ప్రజలపై రవాణా ఖర్చుల భారాన్ని తగ్గించడమే ఈ పథక ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంటున్నారు.
ఈ పథకాన్ని మొదట ఏడాది పాటు ప్రయోగాత్మకంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులతో ఈ అంశంపై చర్చలు జరిపినట్లు సమాచారం.
ప్రస్తుతం ఎంఎంటీఎస్ సేవల ద్వారా రైల్వే శాఖకు సంవత్సరానికి సుమారు రూ.10 కోట్ల ఆదాయం లభిస్తోంది. ఉచిత ప్రయాణ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ఆదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడానికి సిద్ధంగా ఉందని వెల్లడించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు ప్రభుత్వం లేఖ పంపినట్లు తెలిసింది.
అయితే ఈ ప్రతిపాదన అమలుపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ పథకం అమలులోకి వస్తే నగర రవాణా వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
