మన భారత్, ధన్వాడ:
రైతుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వడ్ల కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని నారాయణపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ సదాశివరెడ్డి సూచించారు. శనివారం ధన్వాడ మండల కేంద్రంలోని సింగిల్ విండో కార్యాలయంలో వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, రైతులు తమ పంటను నేరుగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి మద్దతు ధరకు విక్రయించుకోవాలని కోరారు. మధ్యవర్తులను ఆశ్రయించకుండా ప్రభుత్వ సౌకర్యాలను ఉపయోగించుకోవడం ద్వారా రైతులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు.
మార్కెట్ యార్డ్ సీఈవో వెంకట్ రాములు మాట్లాడుతూ, ధన్వాడ విండో పరిధిలో మొత్తం ఆరు వడ్ల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ధన్వాడతో పాటు మందపల్లి, గుండ రామకృష్ణయ్య పల్లి, గోటూర్, కొండ్రోన్ పల్లి గ్రామాల్లో ఈ కేంద్రాలు పనిచేస్తాయని వివరించారు.
అలాగే, ఏ గ్రేడ్ వడ్లకు క్వింటాల్కు రూ. 2389, బి గ్రేడ్ వడ్లకు రూ. 2369 ధరలను ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. రైతులు నాణ్యమైన వడ్లు తీసుకురావాలని, కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకులు మాధవరెడ్డి, సర్పంచ్ జ్యోతి, ఉపసర్పంచ్ పూజారి నరసింహులు, వార్డు సభ్యులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
