మన భారత్, మొగులపల్లి:
అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం పిల్లల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఐసీడీఎస్ సూపర్వైజర్ సుజాత పేర్కొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగులపల్లి మండలంలోని పర్లపల్లి సెక్టార్ పరిధిలోని పెద్దకోమటిపల్లి అంగన్వాడీ కేంద్రంలో సోమవారం బాలామృతం పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సుజాత మాట్లాడుతూ, 6 నెలల నుండి 3 సంవత్సరాల వయస్సు గల చిన్నారులు, అలాగే కిశోర బాలికలకు బాలామృతం మరియు చిక్కి ప్యాకెట్లను అందిస్తున్నట్లు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల్లో అందించే ఆహారంలో అనేక విటమిన్లు, పోషకాలు ఉండి పిల్లల శారీరక, మానసిక అభివృద్ధికి దోహదపడతాయని వివరించారు.
కిశోర బాలికలు రక్తహీనత సమస్యకు గురికాకుండా ఉండేందుకు చిక్కి ప్యాకెట్లను సరఫరా చేస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరూ అంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ సందర్భంగా తల్లుల సమక్షంలో పిల్లల ఎత్తు, బరువులను కొలిచి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించారు.
ప్రతి నెల పిల్లల ఎదుగుదలను గమనించడం చాలా అవసరమని, 3 నుండి 6 సంవత్సరాల పిల్లలను క్రమం తప్పకుండా అంగన్వాడీ కేంద్రాలకు పంపాలని తల్లులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ పుష్పలత, స్కూల్ టీచర్ సుమలత, తల్లులు, పిల్లలు, కిశోర బాలికలు మరియు గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
రాజకీయ నాయకులకు శుభవార్త..!
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
