మన భారత్, పురాణం:
ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు “పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాడు” అనే మాటను తరచుగా వినిపిస్తుంటుంది. ఈ పదానికి మూలం మహాభారతంలో ఉన్న ఒక అత్యంత క్లిష్టమైన యుద్ధ వ్యూహం. శత్రువులను మభ్యపెట్టి వారిని చుట్టుముట్టే విధంగా రూపొందించిన ఈ సైనిక నిర్మాణాన్ని పద్మవ్యూహం లేదా చక్రవ్యుహం అని పిలుస్తారు.

పద్మవ్యూహం ఎలా ఉంటుంది?
మహాభారత యుద్ధంలో కౌరవుల సేనాధిపతి ద్రోణాచార్యుడు రూపొందించిన ఈ యుద్ధ వ్యూహం అత్యంత దుర్భేద్యంగా చెప్పబడింది. తామరపువ్వు ఆకారంలో ఉండే ఈ నిర్మాణంలో ఏడు వలయాలుగా సైన్యాన్ని ఏర్పాటు చేస్తారు. ప్రతి వలయంలో రథ సైన్యం, గజ సైన్యం, అశ్వ సైన్యం మరియు పదాతి సైన్యం ప్రత్యేకంగా క్రమబద్ధంగా నిలబడే విధంగా ఈ వ్యూహం ఉంటుంది.
ఈ వలయాలు ఒకదానికొకటి అనుసంధానమై ఉండటం వల్ల శత్రువులు లోపలికి వెళ్లడం సులభం అయినప్పటికీ బయటకు రావడం చాలా కష్టంగా మారుతుంది. అందుకే ఈ వ్యూహాన్ని దుర్భేద్యమైన యుద్ధ నిర్మాణంగా పురాణాలు పేర్కొంటాయి.

అభిమన్యుడి వీరగాథ
మహాభారత యుద్ధంలో పద్మవ్యూహాన్ని ఛేదించే ఘట్టం ఎంతో ప్రసిద్ధి చెందింది. అర్జునుడి కుమారుడు అభిమన్యుడు ఈ వ్యూహంలోకి ప్రవేశించే పద్ధతి తెలుసుకున్నప్పటికీ బయటకు వచ్చే విధానం పూర్తిగా తెలియకపోయినా ధైర్యంగా లోపలికి వెళ్లాడు. కౌరవుల సైన్యాన్ని ఎదుర్కొంటూ వీరోచితంగా పోరాడినప్పటికీ చివరకు ఆ వ్యూహంలోనే వీరమరణం పొందాడు. ఈ సంఘటన మహాభారతంలో అత్యంత విషాద ఘట్టంగా నిలిచింది.

పద్మవ్యూహాన్ని ఛేదించగలిగిన మహావీరులు
పురాణాల్లోని వివరణల ప్రకారం ఈ క్లిష్టమైన వ్యూహాన్ని పూర్తిగా ఛేదించగలిగే సామర్థ్యం చాలా కొద్దిమందికే ఉన్నట్లు చెప్పబడింది. వారిలో శ్రీకృష్ణుడు, ప్రద్యుమ్నుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, అర్జునుడు వంటి మహా యోధులు ఉన్నారని పురాణాలు పేర్కొంటాయి.

సామెతగా మారిన పద్మవ్యూహం
పద్మవ్యూహం అనే పదం కాలక్రమేణా సామెతగా మారింది. ఎక్కడైనా సమస్యల మధ్య చిక్కుకుని బయటపడలేని పరిస్థితిని సూచించేందుకు “పద్మవ్యూహంలో ఇరుక్కుపోయాడు” అనే మాటను సాధారణంగా ఉపయోగిస్తారు.

మహాభారతంలో ఉన్న ఈ వ్యూహం భారతీయ యుద్ధకళలోని మేధస్సు, వ్యూహాత్మకతను ప్రతిబింబించే గొప్ప ఉదాహరణగా భావించబడుతోంది.
