మన భారత్, హైదరాబాద్:
తెలంగాణలో పరిషత్ ఎన్నికల నిర్వహణపై అనిశ్చితి నెలకొంది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రానికి రావాల్సిన సుమారు రూ.450 కోట్ల నిధులు ఎన్నికల నిర్వహణతో అనుసంధానమై ఉండటంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
సూచనల ప్రకారం, మార్చి 15లోపు పరిషత్ ఎన్నికలు నిర్వహించకపోతే ఆ నిధులు విడుదలలో అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో విద్యార్థుల టెన్త్ ప్రీ-ఫైనల్ పరీక్షలు కొనసాగుతుండగా, మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు వార్షిక పరీక్షలు నిర్వహించనున్న షెడ్యూల్ ఉంది. పరీక్షల సమయంలో ఎన్నికలు నిర్వహించడం పరిపాలనా, భద్రతా పరమైన సవాళ్లకు దారి తీసే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఎన్నికలను ముందుగానే నిర్వహించాలా, లేక పరీక్షల అనంతరం నిర్వహించాలా అన్న అంశంపై ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పరిపాలనా యంత్రాంగం, ఎన్నికల అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం.
ఈ నెల 23న జరగనున్న రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.
