మన భారత్,న్యూఢిల్లీ:
బీఆర్ఎస్ ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ బీజేపీ తరఫున దాఖలైన పిటిషన్ను అత్యున్నత న్యాయస్థానం స్వీకరించింది.
స్పీకర్ గడ్డం ప్రసాద్ కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఫిరాయింపులపై ఇప్పటికే ఉన్న న్యాయ ఆదేశాలను పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశంలో స్పీకర్ వ్యవహరించిన తీరు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వాదించారు.
ఈ కేసులో ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన ప్రధాన పిటిషన్ పెండింగ్లో ఉండగా, మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను దానితో కలిపి విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ అగస్టిన్ జార్జ్లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
ఫిరాయింపు ఎమ్మెల్యేల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారి తీసిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు జోక్యం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ వ్యవహారంపై అన్ని వాదనలు వినేందుకు కోర్టు సిద్ధంగా ఉందని స్పష్టం చేస్తూ, తదుపరి విచారణను ఫిబ్రవరి 6కి వాయిదా వేసింది.
ఈ కేసు ఫలితం రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
