తెలంగాణ పోరాట స్ఫూర్తికి ప్రతీకలైన కవులకు సీఎం ఘన నివాళి
మన భారత్, హైదరాబాద్: “సమాజంలో ఎన్నో వజ్రాలు ఉన్నా… కోహినూర్ వజ్రానికి ఉండే ప్రత్యేకత వేరే. అలాగే ఎన్నో కళాకారులు ఉన్నా కవి అందెశ్రీ మాత్రం కోహినూర్ వజ్రంలా చిరస్థాయిగా నిలిచారు” అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ రవీంద్రభారతిలో నిర్వహించిన దివంగత కవి అందెశ్రీ సంస్మరణ సభలో సీఎం రేవంత్ పాల్గొని మాట్లాడారు.
తెలంగాణ ప్రజలు ప్రేమతో పాటు పోరాటాన్ని కూడా సమానంగా ప్రదర్శించే గొప్పతనం కలవారని సీఎం వ్యాఖ్యానించారు. కవులు, కళాకారులు, ఉద్యమకారులు రాష్ట్ర అభ్యుదయానికి చేసిన సేవలను గుర్తుచేసిన ఆయన, నిజాం పాలన నుండి మలి దశ తెలంగాణ ఉద్యమం వరకు ప్రజలు సాగించిన పోరాటాలను ఉదహరించారు.
గద్దర్, గోరేటి వెంకన్న వంటి ఉద్యమకారులు తెలంగాణకు నూతన స్పూర్తి ఇచ్చారని ముఖ్యమంత్రి తెలిపారు. బడి చదువుకూ వెళ్లని అందెశ్రీ “జయ జయ హే తెలంగాణ” గీతం రూపకల్పన చేసి తెలంగాణ జాతి ఆత్మగా నిలిచిన ఉదాహరణను రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఉద్యమం సమయంలో ప్రతి వేదిక మీద, ప్రతి ఇంటిలో స్పందించిన ఆ గీతాన్ని గత పాలకులు నిర్లక్ష్యం చేయడం దురదృష్టకరమని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర స్వప్నం నెరవేరడానికి అందెశ్రీ, గద్దర్ వంటి మహానీయులే ప్రేరణగా నిలిచారని సీఎం పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ వెంటనే ఈ కుటుంబాలకు అండగా నిలవాలని నిర్ణయం తీసుకుని వారికి ఉద్యోగాలు, గృహాలు అందించడానికి చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. 9 మంది ఉద్యమ కారులను ఇప్పటికే గుర్తించి సత్కరించామని తెలిపారు.
సమాజాన్ని ముందుకు నడిపించేందుకు, దళితులకు నిజమైన భాగస్వామ్యం కల్పించేందుకు రాహుల్ గాంధీ ఆకాంక్షల మేరకు రాష్ట్ర కేబినెట్లో ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చామని సీఎం స్పష్టం చేశారు.
దివంగత కవి అందెశ్రీ తెలంగాణ సాహిత్యానికి, ఉద్యమానికి అందించిన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయని, ప్రజల హృదయాల్లో ఆయన రచనలు ఎప్పటికీ మార్మోగుతాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు.
