మధ్యాహ్న భోజనంలో ‘ఫిష్ కర్రీ’.. కొత్త ఆహార పథకంపై మంత్రి శ్రీహరి సంచలన ప్రకటన
త్వరలో సీఎం రేవంత్తో చర్చించి అమలు.. విద్యార్థులకు పోషకాహారం అందించడమే లక్ష్యం
మన భారత్, హైదరాబాద్ :
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఇక ఫిష్ కర్రీ, ఇతర రుచికరమైన ఆహార పదార్థాలు కూడా చేరనున్నాయి. ఈ విషయం పై రాష్ట్ర మత్స్య, పశుసంవర్థక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి కీలక ప్రకటన చేశారు.
రాష్ట్రంలోని విద్యార్థుల ఆరోగ్యాభివృద్ధి దృష్ట్యా మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత పోషకవంతంగా మార్చాలని నిర్ణయించామని మంత్రి తెలిపారు. “ప్రభుత్వ స్కూళ్లలో పిల్లలకు ఫిష్ కర్రీ, గుడ్లు, పప్పు, పచ్చిమొక్కజొన్న వంటి పోషక పదార్థాలను చేర్చేలా చూస్తాం. ఈ ప్రతిపాదనపై త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో చర్చిస్తాను,” అని శ్రీహరి చెప్పారు.
అదే సమయంలో రాష్ట్రంలోని చేపల ఉత్పత్తి పెంపు దిశగా ప్రభుత్వం పెద్ద ఎత్తున చేప పిల్లల పంపిణీ చేపట్టిందని తెలిపారు. “మేము రాష్ట్రవ్యాప్తంగా 26 వేల నీటి వనరుల్లో చేప పిల్లలను వదులుతున్నాం. వీటిలో 84 కోట్ల చేప పిల్లలు, 10 కోట్ల రొయ్య పిల్లలు ఉంటాయి,” అని వివరించారు.
మంత్రి శ్రీహరి వ్యాఖ్యలు విద్యా, ఆరోగ్య రంగాల సమన్వయంతో ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తున్నాయని అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే విద్యార్థుల కోసం చేపలతో కూడిన పోషకాహార భోజనం అందించే అవకాశం ఉందని తెలుస్తోంది.
