మన భారత్, హైదరాబాద్: మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై అధికారులు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ఆయన క్యాంప్ఆఫీస్లో రెవెన్యూ, పంచాయతీరాజ్, విద్యుత్, ఆర్అండ్బీ, వైద్యారోగ్య, పోలీస్, అగ్నిమాపక, ఎస్డీఆర్ఎఫ్ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాల తీవ్రత, వరద పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. సీఎం మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉందని, అక్కడ రక్షణ చర్యలు వేగవంతం చేయాలని సూచించారు. వరిధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాల్లో తడవకుండా తగు చర్యలు తీసుకోవాలని, రైతుల పంటలు సురక్షితంగా నిల్వ చేయాలని అధికారులను ఆదేశించారు. వర్షాల కారణంగా రైలు రవాణా అంతరాయం ఏర్పడిన ప్రాంతాల్లో ప్రయాణికులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కూడా సూచించారు. హైదరాబాద్ నగరంలో ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులు, వినతులపై జీహెచ్ఎంసీ, హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, అగ్నిమాపక శాఖ సిబ్బంది వెంటనే స్పందించాలని సీఎం రేవంత్ ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, చెరువులు, రిజర్వాయర్ల వద్ద నీటి మట్టం పర్యవేక్షణ నిరంతరం కొనసాగించాలని సూచించారు. నీటితో నిండిన రోడ్లు, కాజ్వేలపై రాకపోకలను పూర్తిగా నిషేధించాలని, పోలీసులు, రెవెన్యూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. వర్షం కారణంగా పేరుకుపోయిన చెత్త, దోమల ఉత్పత్తి నియంత్రణకు సంబంధించి వెంటనే శుభ్రత చర్యలు చేపట్టాలని మున్సిపల్ శాఖకు సూచించారు. వైద్యశాఖ అవసరమైన మందులు సిద్ధంగా ఉంచి, వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో ఎక్కడా నిర్లక్ష్యం చోటు చేసుకోకూడదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. నీటి పారుదల శాఖ అధికారులు చెరువులు, కుంటలు, రిజర్వాయర్ల నీటి స్థాయిని నిరంతరం పరిశీలిస్తూ, అవసరమైతే నీటి విడుదలపై కలెక్టర్లకు ముందుగానే సమాచారం ఇవ్వాలని సూచించారు. పూర్తిగా నిండిన జలాశయాల వద్ద ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. “ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణకు ప్రభుత్వం అన్ని విధాల కట్టుబడి ఉంది” అని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.
–మన భారత్ స్టేట్ బ్యూరో
