జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 135 నామినేషన్లకు ఆమోదం — 81 మంది అభ్యర్థులు బరిలో!
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. మంగళవారం నాటికి ముగిసిన నామినేషన్ల దాఖలులో మొత్తం 211 మంది అభ్యర్థులు 321 నామినేషన్లు సమర్పించారు. వీటిలో ఫార్మాసిటీ, ఆర్ఆర్ఆర్ భూసేకరణ సమస్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పెద్దఎత్తున సామాజిక సంస్థలు, రైతులు, నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం.
బుధవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన పరిశీలన ప్రక్రియ సాయంత్రం వరకు కొనసాగింది. భారీగా నామినేషన్లు రావడంతో అధికారులు సమీక్షా ప్రక్రియను క్షుణ్ణంగా నిర్వహించారు. ఈ క్రమంలో 321 నామినేషన్లలో 135 నామినేషన్లను ఆమోదించి, 186 నామినేషన్లను తిరస్కరించారు.
ఎన్నికల శాఖ ప్రకారం, మొత్తం 81 మంది అభ్యర్థులు ఆమోదించబడిన 135 నామినేషన్లతో అధికారికంగా పోటీలో నిలిచారు. ఇక, వివిధ సాంకేతిక కారణాల వల్ల 130 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి.
ప్రధాన పార్టీల అభ్యర్థులైన నవీన్ యాదవ్ (కాంగ్రెస్), మాగంటి సునీత (బీఆర్ఎస్), లంకల దీపక్ రెడ్డి (బీజేపీ) నామినేషన్లు సక్రమంగా ఆమోదం పొందాయి. నవీన్ యాదవ్ మూడు సెట్లు, మాగంటి సునీత నాలుగు సెట్లు, దీపక్ రెడ్డి నాలుగు సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.
నామినేషన్ల ఆమోదం అనంతరం ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ ఎన్నికల ప్రచారాన్ని మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు. ఇక, నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 24 వరకు గడువు ఉండగా, ఆ తర్వత తుది అభ్యర్థుల జాబితాను ఎన్నికల అధికారులు ప్రకటించనున్నారు.
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ నవంబర్ 11న, ఓట్ల లెక్కింపు నవంబర్ 14న జరగనుంది. ఈ ఉపఎన్నికపై రాష్ట్ర రాజకీయాల్లో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
