వరుస నేరాలకు పాల్పడుతున్న గోపాల్ సింగ్ షెకావత్పై పీడీ యాక్ట్
12 కేసుల్లో నిందితుడు.. 2026లో మూడు కేసులు నమోదు
NH-44పై వాహనదారులు, ట్రాన్స్పోర్టర్లను వేధించినట్లు ఆరోపణలు చర్లపల్లి జైలుకు తరలింపు
మన భారత్, సెప్టెంబర్19, ఆదిలాబాద్: వరుస నేరాలకు పాల్పడుతూ ప్రజా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడనే ఆరోపణల నేపథ్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని తాటిగూడకు చెందిన గోపాల్ సింగ్ షెకావత్ (32)పై పోలీసులు పీడీ యాక్ట్ కింద నిర్బంధ చర్యలు చేపట్టారు. ప్రస్తుతం పశువుల అక్రమ రవాణాకు సంబంధించిన కేసులో రిమాండ్లో ఉన్న అతడిని చర్లపల్లి జైలుకు తరలించినట్లు ఇచ్చోడ రూరల్ సీఐ సిహెచ్. రమేష్ తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గోపాల్ సింగ్ షెకావత్పై గతంలో హత్య, హత్యాయత్నం, మోసం, బెదిరింపులు, దాడులు, వసూళ్లకు సంబంధించిన పలు కేసులు నమోదయ్యాయి. వరుస నేరాల నేపథ్యంలో 2022లో ఆదిలాబాద్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో అతనిపై రౌడీషీట్ కూడా తెరిచినట్లు సీఐ వెల్లడించారు.
జిల్లావ్యాప్తంగా 12 కేసులు
గోపాల్ సింగ్ షెకావత్పై ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఇప్పటివరకు మొత్తం 12 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. 2026లోనే నేరడిగొండ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 259/2026, గుడిహత్నూర్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 254/2026, ఇచ్చోడ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నంబర్ 446/2026 కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పేర్కొన్నారు.
ఈ కేసుల్లో హత్యాయత్నం, మోసం, వసూళ్లు, ప్రజలపై దాడులు, బెదిరింపులకు సంబంధించిన నేరారోపణలు ఉన్నాయని పోలీసులు తెలిపారు. కేసుల దర్యాప్తు, న్యాయపరమైన ప్రక్రియ కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
NH-44పై వాహనదారులను వేధించినట్లు ఆరోపణలు
జాతీయ రహదారి NH-44పై వాహనదారులు, ట్రాన్స్పోర్టర్లను వేధిస్తూ వారిలో భయాందోళనలు కలిగించే విధంగా వ్యవహరించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైందని సీఐ తెలిపారు. ఇటువంటి వరుస నేర కార్యకలాపాలు ప్రజల భద్రత, శాంతిభద్రతలపై ప్రభావం చూపే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్బంధ చర్యలకు అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
ప్రస్తుతం నేరడిగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన పశువుల అక్రమ రవాణా కేసులో గోపాల్ సింగ్ షెకావత్ రిమాండ్ ఖైదీగా ఉన్నాడని పోలీసులు తెలిపారు.
ఎస్పీ సిఫార్సుతో కలెక్టర్ ఆదేశాలు
వరుస నేరాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సిఫార్సు మేరకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఐఏఎస్ పీడీ యాక్ట్ కింద నిర్బంధ చర్యలు చేపట్టినట్లు ఇచ్చోడ రూరల్ సీఐ సిహెచ్. రమేష్ తెలిపారు.
ప్రజల శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేర కార్యకలాపాలకు పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి నేర కార్యకలాపాల సమాచారం తెలిసినా పోలీసులకు సమాచారం అందించి శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని పోలీసులు సూచించారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
