డీజే, వాహనం సీజ్.. ర్యాలీ నిర్వాహకులు, డీజే యజమాని, వాహన యజమానిపై చర్యలు
ఆదిలాబాద్, ఆగస్టు 26: అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజే ఏర్పాటు చేసి ర్యాలీ నిర్వహించిన ఘటనపై ఆదిలాబాద్ టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేసిన డీజేను, దానికి వినియోగించిన వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ర్యాలీ నిర్వాహకులు, డీజే యజమాని, వాహన యజమానితో పాటు మరికొందరిపై కేసులు నమోదు చేసినట్లు టూ టౌన్ ఇన్స్పెక్టర్ కె. నాగరాజు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం ఆదిలాబాద్ పట్టణంలోని జై జవాన్ నగర్ నుంచి అంబేద్కర్ చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి సంబంధించి పోలీసుల నుంచి అవసరమైన అనుమతులు తీసుకోకుండానే అధిక శబ్దం వచ్చేలా ఊఫర్లు ఏర్పాటు చేసి డీజే నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా మితిమీరిన శబ్దంతో డీజే వినియోగిస్తున్న నేపథ్యంలో పోలీసులు అక్కడికి చేరుకుని డీజే పరికరాలతో పాటు వాహనాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
ర్యాలీ నిర్వాహకులు, డీజే యజమానిపై కేసులు
ఈ ఘటనకు సంబంధించి టూ టౌన్ పోలీస్ స్టేషన్లో పలువురిపై కేసులు నమోదు చేశారు. కేసు నమోదైన వారిలో క్రాంతి నగర్కు చెందిన షర్ఫుద్దీన్ (షేక్ ఇబ్రహీం కుమారుడు) ర్యాలీ నిర్వాహకుడిగా, మహారాష్ట్రలోని వని ప్రాంతానికి చెందిన మహమ్మద్ ఇర్ఫాన్ (మహమ్మద్ ఇబ్రహీం షేక్ కుమారుడు) వాహన యజమానిగా, ఆదిలాబాద్కు చెందిన గణేష్ డీజే యజమానిగా ఉన్నారు. వీరితో పాటు మరికొందరు ర్యాలీ నిర్వాహకులపై కూడా కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అనుమతులు తప్పనిసరి
అనుమతులు లేకుండా అధిక శబ్దంతో డీజేలు ఏర్పాటు చేసి ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఇన్స్పెక్టర్ కె. నాగరాజు హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించే నిర్వాహకులు, డీజే యజమానులు, వాహన యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు డీజే పరికరాలు, వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.
జిల్లా వ్యాప్తంగా పోలీస్ యాక్ట్ అమలు
ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉందని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముందస్తు అనుమతులు లేకుండా ర్యాలీలు, సభలు, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రజలకు అసౌకర్యం కలిగించేలా అధిక శబ్దంతో డీజేలు, సౌండ్ సిస్టమ్స్ వినియోగించరాదని సూచించారు.
ప్రజలు పోలీసుల సూచనలు, నిబంధనలను పాటిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు సహకరించాలని టూ టౌన్ పోలీసులు కోరారు.
మీ గొంటిముక్కుల ప్రసాద్ మన భారత్ జిల్లా ఆర్సీ ఇన్చార్జి
ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాల వారీగా విలేకరులు కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
