సేవా భావమే శాశ్వతం.. సమాజానికి చేసిన సేవలే చిరస్థాయిగా నిలుస్తాయి: అజ్మీర శ్యాంనాయక్
లయన్స్ క్లబ్ ఖానాపూర్ అన్నదాత నూతన కమిటీ ప్రమాణ స్వీకారంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి
ఖానాపూర్, మన భారత్: “కన్ను తెరిస్తే జననం.. కన్ను మూస్తే మరణం.. ఈ రెండింటి మధ్య మనిషి సమాజానికి చేసే సేవలే శాశ్వతంగా నిలిచిపోతాయి” అని ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, రిటైర్డ్ డీటీఓ అజ్మీర శ్యాంనాయక్ అన్నారు. మంగళవారం ఖానాపూర్ పట్టణంలోని పీఆర్టీయూ భవన్లో నిర్వహించిన లయన్స్ క్లబ్ ఖానాపూర్ అన్నదాత నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన డాక్టర్ లయన్ సన్నిత్, కార్యదర్శిగా రాజశేఖర్, కోశాధికారిగా రాంచందర్ ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమంలో పీఎంజేఎఫ్ బసవేశ్వర్ రావుతో కలిసి పాల్గొన్న అజ్మీర శ్యాంనాయక్ నూతన కమిటీ సభ్యులకు అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, లయన్స్ క్లబ్ ఖానాపూర్ అన్నదాత సంస్థ ఎన్నో సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు అండగా నిలుస్తోందని కొనియాడారు. విద్య, వైద్యం, రక్తదాన శిబిరాలు, పేదలకు సహాయం, ప్రకృతి వైపరీత్యాల సమయంలో సేవలు అందించడం వంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.
నూతన కమిటీ కూడా సేవా స్ఫూర్తితో ప్రజలకు మరింత చేరువై అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షించారు. సమాజ శ్రేయస్సే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వేంకటేశ్వర్లు, సంజీవ్ రావు, శ్రీనివాస్ రావు, లక్ష్మి, శివ, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.
జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తో పాటు నియోజకవర్గాలకు మండలాలు వారిగా రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
