మన భారత్, తెలంగాణ :
ఉట్నూరు సమీక్షకు జూపల్లి, అడ్లూరి గైర్హాజరు.. కలెక్టర్లతో సమావేశం యథావిధిగా
మన భారత్, ఉట్నూర్:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, వ్యవసాయ సన్నద్ధతపై ఉట్నూరులోని పీఎంఆర్సీ (PMRC)లో సోమవారం నిర్వహించనున్న కీలక సమీక్ష సమావేశానికి రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరు కావడం లేదని అధికారులు తెలిపారు. అనారోగ్య కారణాల వల్ల ఆయన పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించారు.
అదే సమావేశానికి హాజరుకావాల్సిన మరో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పర్యటన కూడా వాయిదా పడినట్లు అధికారులు స్పష్టం చేశారు. దీంతో ఇద్దరు మంత్రులు సమావేశానికి గైర్హాజరు కానున్నప్పటికీ, ముందుగా ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారమే అధికారుల సమీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు పాల్గొని ప్రస్తుత వర్షాభావ పరిస్థితులు, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితి, పంటల సాగు, రైతులకు అందిస్తున్న సేవలు, వ్యవసాయ శాఖ చేపట్టిన ముందస్తు చర్యలపై సమగ్రంగా చర్చించనున్నారు. అలాగే వర్షాభావం నేపథ్యంలో రైతులకు అవసరమైన సూచనలు, ప్రత్యామ్నాయ పంటల సాగు, నీటి సంరక్షణ చర్యలు, ప్రభుత్వ శాఖల సమన్వయంపై కూడా అధికారులు సమీక్ష నిర్వహించనున్నారు.
రాష్ట్రంలో ఎల్నినో ప్రభావం, తక్కువ వర్షపాతం అవకాశాల నేపథ్యంలో వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి సారించిన ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తోంది. ఈ క్రమంలో నాలుగు జిల్లాల అధికారులతో జరుగుతున్న సమీక్ష సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
మంత్రుల పర్యటనలు వాయిదా పడినప్పటికీ, సమావేశం మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా నిర్ణయించిన సమయానికే నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. సమావేశంలో తీసుకునే నిర్ణయాలు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే కార్యాచరణకు మార్గదర్శకంగా నిలవనున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో పని చేయుటకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్స్ నియోజకవర్గ ఇన్చార్జి లు మండల రిపోర్టర్స్ కావలెను ఆసక్తి ఉన్న వారు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
