నకిలీ విత్తనాల విక్రయంపై జైనథ్ పోలీసుల మెరుపు దాడి
మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి రైతులకు విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్
11 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, రెండు సెల్ఫోన్లు, మోటార్సైకిల్ స్వాధీనం
నకిలీ విత్తనాల వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవు: జైనథ్ సీఐ జి. శ్రావణ్
మన భారత్, జైనథ్:
రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న వ్యక్తులపై జైనథ్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో నకిలీ విత్తనాల విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
జైనథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాంపూర్ గ్రామంలో జూన్ 26న రాత్రి సమయంలో ఎస్ఐ పవార్ గౌతమ్, మండల వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్సైకిల్పై అనుమానాస్పదంగా సంచి తీసుకెళ్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి తనిఖీ చేయగా వారి వద్ద నకిలీ విత్తనాల ప్యాకెట్లు లభించాయి.
పోలీసుల విచారణలో నిందితులను మహారాష్ట్ర రాష్ట్రం యవత్మాల్ జిల్లా జరి జామ్ని మండలం లింగటి గ్రామానికి చెందిన జీవన్ లక్ష్మణ్ కాలే (38), పవన్ లక్ష్మణ్ కాలేగా గుర్తించారు. వీరు మహారాష్ట్ర నుంచి నకిలీ విత్తనాలు తీసుకొచ్చి తెలంగాణ ప్రాంత రైతులకు విక్రయిస్తున్నట్లు వెల్లడైంది.
నిందితుల నుంచి 11 నకిలీ విత్తనాల ప్యాకెట్లు, రెండు సెల్ఫోన్లు, ఒక మోటార్సైకిల్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు.
ఈ సందర్భంగా జైనథ్ సీఐ జి. శ్రావణ్ మాట్లాడుతూ రైతులను మోసం చేసే నకిలీ విత్తనాల విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసే సమయంలో జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
ఈ దాడిలో జైనథ్ ఎస్ఐ పి. గౌతమ్, బోరజ్ మండల వ్యవసాయ అధికారి అర్షఫ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
–గొంటి ముక్కుల ప్రసాద్ జర్నలిస్ట్ మన భారత్
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
