ప్రజా భద్రతకు సీసీటీవీలు కీలకం

Published on

-Advertisement-

 ప్రజా ఉద్యమంలా కెమెరాల ఏర్పాటు కొనసాగాలి: జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

నేరాల నియంత్రణ, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజాప్రతినిధులకు అవగాహన సదస్సు

మన భారత్, ఆదిలాబాద్:

ఆదిలాబాద్ జిల్లాలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ప్రజా ఉద్యమంలా కొనసాగాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్‌పీ) అఖిల్ మహాజన్ ఐపీఎస్ పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరాలను అరికట్టడంతో పాటు ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో స్థానిక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో నిర్వహించిన ప్రత్యేక అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు.

ఈ సదస్సుకు ఆదిలాబాద్ పట్టణ కౌన్సిలర్లు, ఆదిలాబాద్ రూరల్, జైనథ్, బీంపూర్, బేల, తాంసి, తలమడుగు మండలాల సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సీసీటీవీ కెమెరాల ప్రాముఖ్యత, ప్రజా భద్రతలో వాటి పాత్ర, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత అంశాలపై ఎస్పీ సమగ్ర అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎస్పీ అఖిల్ మహాజన్ మాట్లాడుతూ, ప్రస్తుతం నేరాల నియంత్రణలో సీసీటీవీ కెమెరాలు అత్యంత ప్రభావవంతమైన సాధనంగా మారాయని అన్నారు. నేరం జరిగిన తర్వాత దాని ఛేదన, నిందితుల గుర్తింపు, దర్యాప్తు ప్రక్రియ వేగవంతం కావడంలో సీసీటీవీల పాత్ర అమూల్యమని పేర్కొన్నారు. జిల్లాలో గతంలో జరిగిన అనేక కేసులను సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా విజయవంతంగా ఛేదించిన విషయాన్ని ఉదాహరణలతో వివరించారు.

సీసీటీవీ కెమెరాల ద్వారా నేరస్తుల కదలికలను గుర్తించడం, సంఘటనల అసలు స్వరూపాన్ని తెలుసుకోవడం, నిందితులను త్వరగా పట్టుకోవడం సాధ్యమవుతుందని చెప్పారు. అంతేకాకుండా కెమెరాల ఉనికి వల్ల నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో భయం ఏర్పడి నేరాల శాతం కూడా తగ్గుతుందని తెలిపారు. ప్రతి గ్రామం, ప్రతి కాలనీ, ప్రతి ప్రధాన కూడలి, మార్కెట్ ప్రాంతం, దేవాలయాలు, విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాల పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసేలా ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలని సూచించారు.

జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని ఎస్పీ పిలుపునిచ్చారు. యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా కాపాడటం సమాజ బాధ్యత అని అన్నారు. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మత్తు పదార్థాలకు అలవాటు పడిన వ్యక్తుల వివరాలను పోలీసులకు తెలియజేస్తే, డి-అడిక్షన్ సెంటర్ల ద్వారా వారికి చికిత్స అందించి సాధారణ జీవితంలోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రోడ్డు ప్రమాదాల నివారణపై కూడా ఎస్పీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. గ్రామస్థాయిలో రోడ్డు భద్రత, ట్రాఫిక్ నియమాలు, హెల్మెట్ వినియోగంపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులకు సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించేందుకు ప్రజల్లో చైతన్యం కల్పించడం అత్యంత అవసరమన్నారు.

సదస్సులో పాల్గొన్న ప్రజాప్రతినిధులు తమ గ్రామాలు, వార్డుల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు కృషి చేస్తామని, గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రత కార్యక్రమాల్లో పోలీసులకు పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్. జీవన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, సీఐలు బి. సునీల్ కుమార్, కె. నాగరాజు, బి.డి. ప్రేమ్ కుమార్, జి. శ్రావణ్, రహీం పాషా, ఆర్‌ఎస్‌ఐ మహేష్, స్థానిక కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

గొంటి ముక్కుల ప్రసాద్ రిపోర్టర్ మన భారత్ .

మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..

Latest articles

డిపో మేనేజర్‌గా సాయన్న బాధ్యతలు..

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎన్. సాయన్న బాధ్యతల స్వీకరణ ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం – నూతన డిపో...

ఇక పంచాయతీలపై ప్రత్యేక నిఘా.!

స్పెషల్ ఆఫీసర్‌గా నర్సింగులు నియామకం గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ – అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు మన భారత్,...

బదిలీపై వెళ్తున్న ఎస్ఐకి ఘన వీడ్కోలు..

ప్రజల మనసులు గెలుచుకున్న పోలీస్ అధికారి సేవలకు ప్రశంసల వెల్లువ మన భారత్, నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో...

హరీశ్ రావు ఆరోపణలపై మంత్రుల ఘాటు స్పందన

సంక్షేమ శాఖల్లో అవినీతి జరిగిందని నిరూపిస్తే దేనికైనా సిద్ధం: మంత్రి పొన్నం ప్రభాకర్ రూ.2 వేల కోట్ల అవినీతి ఆరోపణలు...

More like this

డిపో మేనేజర్‌గా సాయన్న బాధ్యతలు..

ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్‌గా ఎన్. సాయన్న బాధ్యతల స్వీకరణ ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం – నూతన డిపో...

ఇక పంచాయతీలపై ప్రత్యేక నిఘా.!

స్పెషల్ ఆఫీసర్‌గా నర్సింగులు నియామకం గ్రామాల్లో ప్రభుత్వ పథకాల అమలుపై పర్యవేక్షణ – అభివృద్ధి కార్యక్రమాల వేగవంతానికి చర్యలు మన భారత్,...

బదిలీపై వెళ్తున్న ఎస్ఐకి ఘన వీడ్కోలు..

ప్రజల మనసులు గెలుచుకున్న పోలీస్ అధికారి సేవలకు ప్రశంసల వెల్లువ మన భారత్, నెల్లిమర్ల: విజయనగరం జిల్లా నెల్లిమర్ల మండల కేంద్రంలో...