ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా జాజాపూర్ పాఠశాల ఉపాధ్యాయుల అవగాహన కార్యక్రమం
ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని వసతులు ఉచితం
– ప్రధానోపాధ్యాయురాలు భారతి
మన భారత్ | నారాయణపేట:
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు శాతం పెంచడం, బడి బయట ఉన్న పిల్లలను తిరిగి విద్యా వ్యవస్థలోకి తీసుకురావడం లక్ష్యంగా నిర్వహిస్తున్న ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా సోమవారం జాజాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం అప్పిరెడ్డిపల్లి గ్రామాన్ని సందర్శించి ఇంటింటికీ వెళ్లి తల్లిదండ్రులతో మాట్లాడారు.
గ్రామంలో 6 నుంచి 14 సంవత్సరాల వయస్సు గల పిల్లలను గుర్తించి, బడి మానేసిన విద్యార్థుల వివరాలను సేకరించారు. ప్రతి బాలబాలిక తప్పనిసరిగా పాఠశాలలో చేరి విద్యను అభ్యసించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని వివరించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన తల్లిదండ్రుల సమావేశంలో ప్రధానోపాధ్యాయురాలు భారతి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫారాలు, మధ్యాహ్న భోజనం వంటి అన్ని సౌకర్యాలు ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. బడి మానేసిన పిల్లలను తిరిగి విద్యా ప్రవాహంలోకి తీసుకురావడానికి ప్రత్యేక బ్రిడ్జి కోర్సులు కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు.
ప్రైవేట్ పాఠశాలలతో సమానంగా ప్రభుత్వ పాఠశాలల్లోనూ నాణ్యమైన విద్య, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, మెరుగైన మౌలిక వసతులు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భాను ప్రకాష్, లక్ష్మణ్, నరసింహ, రఘురాం రెడ్డి, ప్రతాప్, నిర్మల, శశిరేఖతో పాటు గ్రామ తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. విద్యా హక్కు ప్రతి చిన్నారికి అందేలా బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉపాధ్యాయులు పిలుపునిచ్చారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
