మన భారత్, ఆదిలాబాద్
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు పోలీస్ స్టేషన్ను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బక్రీద్ పండుగ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను సమీక్షించిన ఆయన, మండల పరిధిలో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో పోలీసులు 24 గంటలు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశించారు.
ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తూ అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని హెచ్చరించారు.
పోలీస్ స్టేషన్ పరిశీలనలో భాగంగా స్టేషన్ రికార్డులు, పెండింగ్ కేసులు, విచారణల పురోగతిని ఎస్పీ సమీక్షించారు. కేసుల పరిష్కారంలో వేగం పెంచాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా నకిలీ విత్తనాల విక్రయాలు, గంజాయి అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమ కార్యకలాపాలపై సమాచార వ్యవస్థను బలోపేతం చేయాలని, ప్రజల సహకారంతో నేర నియంత్రణ చేపట్టాలని సూచించారు. ప్రతి గ్రామంలో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు ద్వారా నేరాల నియంత్రణకు సహకారం అందుతుందని పేర్కొన్నారు.
అలాగే ఆర్థిక నేరాలు, సైబర్ మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని పోలీసు సిబ్బందికి సూచించారు. ప్రజల సమస్యలను సత్వరంగా పరిష్కరించే విధంగా పోలీసులు పనిచేయాలని అన్నారు.
ఎస్పీ ఆకస్మిక తనిఖీతో పోలీస్ స్టేషన్ సిబ్బంది అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తామని అధికారులు తెలిపారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
