– మూడు నెలలుగా మంచినీటి ఇబ్బందులు
– తీర్మానాలు చేసినా పట్టించుకోని పంచాయతీ అధికారులు
మన భారత్, ధన్వాడ:
మండల కేంద్రంగా అన్ని ప్రభుత్వ శాఖలు ఉన్న ధన్వాడలోనే మంచినీటి సమస్య తీవ్ర రూపం దాల్చడం స్థానిక ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. ధన్వాడ గ్రామంలోని 10వ వార్డు ప్రజలు గత మూడు నెలలుగా తీవ్రమైన తాగునీటి సమస్యతో ఇబ్బందులు పడుతున్నప్పటికీ గ్రామపంచాయతీ అధికారులు, మిషన్ భగీరథ సిబ్బంది పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“అమ్మ కలెక్టర్ అమ్మ… మాకు నీళ్లు తాపవమ్మ…” అంటూ స్థానిక మహిళలు, వృద్ధులు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి పలుమార్లు సర్పంచ్కు, గ్రామ కార్యదర్శికి, మిషన్ భగీరథ అధికారులకు సమస్యను వివరించినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం చూపలేదని స్థానికులు మండిపడుతున్నారు.
మండల కేంద్రంలోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎలాంటి కష్టాలు పడుతున్నారో అర్థం చేసుకోవచ్చని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గ్రామపంచాయతీలో నిధులు ఉన్నప్పటికీ ప్రజల ప్రాథమిక అవసరమైన మంచినీటి సమస్యను ఎందుకు పరిష్కరించడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల వీధిలో ఒక కుటుంబంలో మరణం సంభవించిన సమయంలో అంత్యక్రియల అనంతరం స్నానాలకు కూడా నీళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాధిత కుటుంబాలు వాపోతున్నాయి. సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేకపోవడం పట్ల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
పదేపదే ఫిర్యాదులు చేసినా అధికారులు కేవలం హామీలకే పరిమితం అవుతున్నారని, వెంటనే శాశ్వత పరిష్కారం చూపించి ప్రతి ఇంటికి తాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని 10వ వార్డు ప్రజలు జిల్లా కలెక్టర్ను కోరుతున్నారు.
ధన్వాడలో నెలకొన్న ఈ మంచినీటి సమస్యపై ఉన్నతాధికారులు స్పందించి తక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
