మన భారత్, ఆదిలాబాద్:
సాంకేతికత వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పేర్కొన్నారు. ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి, డిజిటల్ లావాదేవీల్లో జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు.
బుధవారం టీటీడీసీలో నిర్వహించిన “ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యాచరణలో భాగంగా సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చదువుకున్న వారు, ఉన్నత పదవుల్లో ఉన్నవారు సైతం సైబర్ మోసాలకు గురవుతుండటం ఆందోళనకరమని అన్నారు.
అనుమానాస్పద లింకులు, అపరిచిత ఫోన్ కాల్స్, మెసేజ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత బ్యాంకింగ్ వివరాలు, ఓటీపీలు, పాస్వర్డ్లు ఎవరితోనూ పంచుకోకూడదని స్పష్టం చేశారు. సైబర్ నేరాల నుంచి రక్షణకు అవగాహన ఎంతో ముఖ్యమని, ఏదైనా అనుమానాస్పద ఘటనలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.
డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ సేవలను వినియోగించే సమయంలో అధికారిక వెబ్సైట్లు, విశ్వసనీయ యాప్లను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే సైబర్ మోసాలను నివారించవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు.
ఈ అవగాహన సదస్సులో అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొని సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
