మన భారత్, హైదరాబాద్:
రాష్ట్రంలో చేయూత పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెంచుతూ అక్రమాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతున్న ఫేస్ రికగ్నిషన్ విధానాన్ని ఇకపై రాష్ట్రంలోని అన్ని పట్టణాలు, నగరాల్లోనూ అమలు చేయాలని నిర్ణయించింది.
ఈ కొత్త విధానం ద్వారా పింఛన్ల పంపిణీలో ఉన్న లోపాలను సరిదిద్దడంతో పాటు నకిలీ లబ్ధిదారులను గుర్తించి తొలగించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ముఖ్యంగా చనిపోయిన వారి పేర్లతో అక్రమంగా పింఛన్ డబ్బులు తీసుకుంటున్న ఘటనలకు ఈ విధానం పూర్తి స్థాయిలో చెక్ పెడుతుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఈ విధానం అమలుకు సంబంధించి హైదరాబాద్లోని ప్రజాభవన్లో ఇటీవల ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. జిల్లా సమన్వయకర్తలు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ప్రాజెక్టు మేనేజర్లు, వార్డు స్థాయి అధికారులకు సమగ్ర శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ పొందిన అధికారులు తమ పరిధిలోని సిబ్బందికి అవగాహన కల్పించి క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేస్తారని పట్టణ ప్రాంతాల పేదరిక నిర్మూలన సంస్థ (MEPMA) సీఈఓ దివ్య దేవరాజన్ తెలిపారు.
ఇప్పటి వరకు పింఛన్ల పంపిణీలో వేలిముద్రల ఆధారిత విధానం అమలులో ఉండగా, వృద్ధుల వేలిముద్రలు సరైన విధంగా నమోదు కాకపోవడంతో పలు ఇబ్బందులు ఎదురయ్యేవి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీని ప్రవేశపెట్టారు.
ముఖ్యంగా బ్యాంక్ ఖాతాల ద్వారా పింఛన్ పొందుతున్న లబ్ధిదారుల వివరాలను ఈ విధానం ద్వారా సేకరించనున్నారు. దీనివల్ల లబ్ధిదారులు యాప్ ద్వారా సులభంగా తమ గుర్తింపును నిర్ధారించుకుని పింఛన్ పొందగలుగుతారు. అలాగే వరుసగా మూడు నెలలు పింఛన్ తీసుకోని వారిని గుర్తించడం, చనిపోయిన వారి పేర్లను జాబితా నుంచి తొలగించడం, వలస వెళ్లిన వారి వివరాలు తెలుసుకోవడం వంటి అంశాలు సులభమవుతాయి.
ఈ కొత్త సాంకేతిక విధానం ద్వారా అర్హులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందేలా చేయడం ప్రధాన లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. దీంతో పింఛన్ల పంపిణీలో పారదర్శకత పెరగడంతో పాటు అవినీతి, అక్రమాలు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
