మన భారత్, మహారాష్ట్ర:
మహారాష్ట్రలోని బారామతి విమాన ప్రమాదంపై డీజీసీఏ (DGCA) వర్గాలు కీలక విషయాలను వెల్లడించాయి. ఈ ఘటన సమయంలో పైలట్ల నుంచి మేడే కాల్ (సహాయం కోరే అత్యవసర సంకేతం) అందలేదని డీజీసీఏ స్పష్టం చేసింది. ల్యాండింగ్ సమయంలో రన్వేను గుర్తించడంలో పైలట్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని తెలిపింది.
డీజీసీఏ వర్గాల వివరాల ప్రకారం, బారామతి విమానాశ్రయం టేబుల్టాప్ రన్వే కేటగిరీకి చెందిందని వెల్లడించారు. ఇది సాధారణంగా ఎత్తయిన కొండ ప్రాంతాల్లో ఉండే రన్వే అని వివరించారు. తొలి ల్యాండింగ్ ప్రయత్నంలో రన్వే స్పష్టంగా కనిపించకపోవడంతో విమానం కొంతసేపు గాల్లోనే చక్కర్లు కొట్టిందని తెలిపారు.
ఆ తరువాత రెండోసారి ల్యాండింగ్కు ప్రయత్నించగా అది విఫలమై విమానం కుప్పకూలినట్లు డీజీసీఏ వర్గాలు పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి అన్ని కోణాల్లో పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని, సాంకేతిక అంశాలు, వాతావరణ పరిస్థితులు, లైటింగ్ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. పూర్తిస్థాయి నివేదిక అనంతరం మరిన్ని వివరాలు వెల్లడిస్తామని అధికారులు తెలిపారు.
