మన భారత్ ,తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రం వ్యవసాయంతో పాటు అన్ని రంగాల్లో వేగవంతమైన ప్రగతితో దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. భారతదేశ 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం ఘనంగా నిర్వహించిన రాష్ట్రస్థాయి వేడుకల్లో గవర్నర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, సైనికుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో గవర్నర్ ‘రైజింగ్ తెలంగాణ–2047’ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రభుత్వం సరికొత్త లక్ష్యాలను నిర్దేశించుకుందని తెలిపారు. స్వల్ప కాలంలోనే తెలంగాణ సాధించిన ప్రగతి అభినందనీయమని కొనియాడారు.
రాజ్యాంగ విలువలను కాపాడుతూ అభివృద్ధి పథంలో తెలంగాణ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. ఇటీవల విడుదల చేసిన ‘రైజింగ్ తెలంగాణ’ డాక్యుమెంట్ హైదరాబాద్ ప్రతిష్ఠను గ్లోబల్ స్థాయిలో మరింత పెంచేలా రూపొందించబడిందన్నారు. రాష్ట్రాన్ని మూడు ఆర్థిక జోన్లుగా విభజించి, ప్రతి ప్రాంతానికి తగిన అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నట్లు వివరించారు.
యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణను గ్లోబల్ స్కిల్ హబ్గా మార్చే దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా తీర్చిదిద్దడంతో పాటు, ఇప్పటివరకు 62 వేల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించారు. విద్య, ఉపాధి రంగాల్లో తీసుకుంటున్న చర్యలు రాష్ట్ర ఆర్థిక బలాన్ని మరింత పెంచుతాయని గవర్నర్ అభిప్రాయపడ్డారు.
వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని గవర్నర్ స్పష్టం చేశారు. ధాన్య ఉత్పత్తిలో సాధించిన విజయాలతో పాటు రైతులకు ప్రభుత్వం పెద్ద ఎత్తున మద్దతు అందిస్తోందన్నారు. ధాన్యానికి బోనస్గా రూ.1,780 కోట్లు చెల్లించడమే కాకుండా, సన్నవడ్లకు క్వింటాల్కు రూ.500 బోనస్ అందిస్తున్నట్లు తెలిపారు. 26 లక్షల మంది రైతులకు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేసినట్లు గుర్తు చేశారు. రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు.
భూ వివాదాల పరిష్కారానికి భూభారతి చట్టాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. మేడారం అభివృద్ధికి రూ.251 కోట్లు కేటాయించడం ద్వారా గిరిజన సంస్కృతి పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. పేదల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదలకు సొంతింటి కలను నెరవేర్చుతున్నామని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో పెద్ద సంఖ్యలో ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు వివరించారు.
రాష్ట్రంలో 1.30 కోట్ల కుటుంబాలకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని గవర్నర్ స్పష్టం చేశారు. వైద్య రంగంలోనూ కీలక నిర్ణయాలు తీసుకుంటూ, 27 ఎకరాల్లో రూ.2 వేల కోట్లతో కొత్త ఉస్మానియా ఆస్పత్రి నిర్మాణం చేపట్టి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
