ఈనెల 31 నుంచి కేంద్ర బడ్జెట్ సమావేశాలు!
మన భారత్, న్యూఢిల్లీ:
దేశ రాజకీయాల్లో కీలక పరిణామాలకు వేదిక కానున్న పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజున పార్లమెంటు ఉభయ సభలు సమావేశమవుతాయి. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి సంప్రదాయ ప్రసంగం చేయనున్నారు.
ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్ను పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా తొలిసారిగా ఆదివారం రోజున రాజ్యసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దేశ ఆర్థిక పరిస్థితి, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ బడ్జెట్లో కీలక ప్రకటనలు ఉండనున్నాయని అంచనాలు ఉన్నాయి.

ఈ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం పలు కీలక బిల్లులను ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించే విధానానికి సంబంధించిన ‘వన్ నేషన్ – వన్ ఎలక్షన్’ బిల్లుపై విస్తృత చర్చ జరగనుంది. అదేవిధంగా 30 రోజులు జైల్లో ఉంటే ముఖ్యమంత్రి సహా మంత్రులను పదవుల నుంచి తొలగించే విధానానికి సంబంధించిన బిల్లుపై కూడా సభల్లో చర్చ జరగనుందని సమాచారం.
ఈ బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందితే దేశ రాజకీయ వ్యవస్థలో గణనీయమైన మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఈసారి బడ్జెట్ సమావేశాలు రాజకీయంగా, విధానపరంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయని భావిస్తున్నారు.
