హౌస్ సర్జన్ లావణ్య మృతి కేసులో కీలక మలుపు
మన భారత్, సిద్దిపేట : సిద్దిపేట మెడికల్ కళాశాలలో చోటు చేసుకున్న హౌస్ సర్జన్ లావణ్య మృతి ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. జోగులాంబ గద్వాల జిల్లాకు చెందిన లావణ్య, సిద్దిపేట మెడికల్ కాలేజీలో 2020 బ్యాచ్ మెడిసిన్ విద్యార్థినిగా చదువుకుని, ప్రస్తుతం హౌస్ సర్జన్గా విధులు నిర్వహిస్తోంది. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను చికిత్స నిమిత్తం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనతో కళాశాల ప్రాంగణంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
లావణ్య మృతికి గల కారణాలపై మొదట అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించి, కుటుంబ సభ్యులు, సహచరుల వాంగ్మూలాలు సేకరించడంతో పాటు సాంకేతిక ఆధారాలను పరిశీలించారు. దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.

పోలీసుల విచారణ ప్రకారం, లావణ్యకు డాక్టర్ ప్రణయ్ తేజ్తో గత ఏడాది నుంచి సన్నిహిత సంబంధం ఉన్నట్లు వెల్లడైంది. పెళ్లి విషయానికి వచ్చేసరికి కుల భేదాన్ని కారణంగా చూపుతూ ప్రణయ్ వెనక్కి తగ్గినట్టు సమాచారం. ఈ పరిణామం లావణ్యను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేసిందని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, కాల్ రికార్డులు, చాట్ వివరాలు తదితర సాంకేతిక ఆధారాల ఆధారంగా డాక్టర్ ప్రణయ్ తేజ్ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటన వైద్య విద్యార్థుల భద్రత, మానసిక ఆరోగ్యం, ఒత్తిడిని ఎదుర్కొనే వ్యవస్థలపై మరోసారి చర్చకు దారి తీసింది. కేసుపై మరింత లోతైన విచారణ కొనసాగుతోందని సిద్దిపేట పోలీసులు తెలిపారు.
