స్మృతి మంధాన అరుదైన ఘనత.. 10 వేల పరుగులతో చరిత్ర
మన భారత్, స్పోర్ట్స్ న్యూస్:
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన అంతర్జాతీయ క్రికెట్లో అరుదైన ఘనతను సాధించి చరిత్ర సృష్టించారు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 10,000 పరుగులు పూర్తి చేసిన భారతీయ మహిళా క్రికెటర్గా ఆమె రికార్డు సృష్టించారు. ఈ మైలురాయిని తిరువనంతపురం వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో స్మృతి మంధాన అందుకున్నారు.
ఈ ఘనతతో అంతర్జాతీయ మహిళా క్రికెట్లో 10 వేల పరుగుల క్లబ్లోకి అడుగుపెట్టిన నాలుగో బ్యాటర్గా స్మృతి మంధాన నిలిచారు. స్థిరత్వం, సొగసైన బ్యాటింగ్ స్టైల్తో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించిన స్మృతి, భారత మహిళా క్రికెట్కు గర్వకారణంగా మారారు.
అంతర్జాతీయ మహిళా క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో స్మృతి మంధానకు ముందు మిథాలీ రాజ్ (భారత్) 10,868 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాత న్యూజిలాండ్కు చెందిన సుజీ బేట్స్ (10,652), ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ షార్లెట్ ఎడ్వర్డ్స్ (10,273) ఉన్నారు. ఇప్పుడు ఈ ఎలైట్ లిస్టులో స్మృతి మంధాన పేరు కూడా చిరస్థాయిగా నిలిచింది.
భారత జట్టుకు ఎన్నో కీలక విజయాల్లో ప్రధాన పాత్ర పోషించిన స్మృతి మంధాన ఈ రికార్డుతో యువ క్రికెటర్లకు ప్రేరణగా నిలిచారు. అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆమెపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. భవిష్యత్తులో మరిన్ని రికార్డులు బద్దలుకొట్టాలని దేశవ్యాప్తంగా క్రీడాభిమానులు ఆకాంక్షిస్తున్నారు.
