గుడివాడ అమర్నాథ్ నోరు అదుపులో పెట్టుకోవాలి
హోంమంత్రి అనితపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలి: టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి
మన భారత్, గజపతినగరం:
ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ టిడిపి పోలిట్ బ్యూరో సభ్యురాలు గంట్యాడ శ్రీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. హోంమంత్రి అనితపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
మంగళవారం గజపతినగరం పార్టీ కార్యాలయం వద్ద టిడిపి మహిళా నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చిత్రపటంపై కోడిగుడ్లు విసిరి నిరసన వ్యక్తం చేశారు. “మహిళా ద్రోహి డౌన్ డౌన్”, “గుడివాడ అమర్నాథ్ క్షమాపణ చెప్పాలి” అంటూ నినాదాలు చేస్తూ ఆందోళన నిర్వహించారు.
ఈ సందర్భంగా గంట్యాడ శ్రీదేవి మాట్లాడుతూ రాష్ట్ర హోంమంత్రి హోదాలో ఉన్న మహిళను “మేకప్ ఆర్టిస్ట్” అంటూ వ్యాఖ్యానించడం గుడివాడ అమర్నాథ్కు మహిళల పట్ల ఉన్న చిన్నచూపుకు నిదర్శనమని విమర్శించారు. మహిళలను గౌరవించాల్సిన బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అత్యంత బాధాకరమని అన్నారు.
మహిళల సాధికారత, భద్రత కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంటే ప్రతిపక్ష నాయకులు మహిళా మంత్రులపై వ్యక్తిగత విమర్శలకు దిగడం వారి రాజకీయ సంస్కృతిని బయటపెడుతోందని పేర్కొన్నారు. గతంలో కూడా వైసీపీ నాయకత్వం మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణలో హోంమంత్రి అనిత సమర్థవంతంగా వ్యవహరిస్తున్నారని శ్రీదేవి అన్నారు. మహిళ అయినప్పటికీ అత్యంత సమర్థవంతంగా తన బాధ్యతలను నిర్వహిస్తూ రాష్ట్ర పోలీసు వ్యవస్థను సమన్వయం చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు. అలాంటి నాయకురాలిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు.
గుడివాడ అమర్నాథ్ రాజకీయ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన వ్యక్తి కావడంతో ప్రజా వేదికలపై మాట్లాడేటప్పుడు మరింత బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. మహిళల గురించి మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని హితవు పలికారు. ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న మంత్రిని కించపరిచేలా మాట్లాడటం సిగ్గుచేటు చర్య అని విమర్శించారు.
రెండేళ్ల కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు విజయవంతంగా అమలవుతుండటంతో ప్రజల దృష్టిని మరల్చేందుకు ప్రతిపక్షాలు ఇటువంటి వివాదాస్పద వ్యాఖ్యలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం మహిళలను లక్ష్యంగా చేసుకోవడం సమంజసం కాదన్నారు.
గత ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును ప్రతిపక్ష నాయకులు గుర్తుంచుకోవాలని, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన సమయంలో వ్యక్తిగత విమర్శలకు దిగడం వారి వైఫల్యాన్ని సూచిస్తోందని అన్నారు. మహిళల గౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసే వారిని మహిళా సమాజం ఎప్పటికీ క్షమించదని హెచ్చరించారు.
హోంమంత్రి అనితకు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టే పరిస్థితి ఏర్పడుతుందని గంట్యాడ శ్రీదేవి హెచ్చరించారు.
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ సర్పంచులు ఉంకాన అరుణ, లంక పద్మ, దామర్లపేట అరుణతో పాటు పలువురు మహిళా నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
