మన భారత్
మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్ ధరల షాక్.. 3-6 నెలల్లో టారిఫ్ పెంపు అవకాశం
దేశంలోని మొబైల్ వినియోగదారులకు మరోసారి రీఛార్జ్ ధరల భారం పడే సూచనలు కనిపిస్తున్నాయి. రానున్న మూడు నుంచి ఆరు నెలల వ్యవధిలో టెలికాం కంపెనీలు తమ టారిఫ్ ఛార్జీలను పెంచే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఈ విషయాన్ని గౌరవ్ మల్హోత్రా వెల్లడించారు. గతంలో టెలికాం సంస్థలు 15 నుంచి 20 శాతం వరకు టారిఫ్ ధరలను పెంచగా, ఈసారి పెంపు 10 శాతంలోపే ఉండే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
దేశంలో డేటా వినియోగం పెరుగుతుండటం, నెట్వర్క్ విస్తరణకు భారీ పెట్టుబడులు అవసరమవడం, 5జీ సేవల అభివృద్ధికి అయ్యే ఖర్చులు పెరగడం వంటి కారణాలతో టెలికాం సంస్థలు ధరల పెంపు వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నిత్యావసర వస్తువులు, గ్యాస్, ఇంధన ధరల పెరుగుదలతో సామాన్య ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థితుల్లో మొబైల్ రీఛార్జ్ ధరలు కూడా పెరిగితే కుటుంబాల నెలవారీ ఖర్చులపై అదనపు భారం పడే అవకాశం ఉందని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
టెలికాం సంస్థల నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ, రాబోయే నెలల్లో రీఛార్జ్ ప్లాన్ల ధరలు పెరిగే అవకాశముందన్న వార్త ప్రస్తుతం మొబైల్ వినియోగదారుల్లో చర్చనీయాంశంగా మారింది.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
