మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా హెడ్ క్వార్టర్లోని జిల్లా వయోవృద్ధుల సమైక్య కార్యాలయంలో సోమవారం వన్నెల ఎల్లన్న జయంతి మరియు మద్ది రామచందర్ 26వ వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం , ఎంప్లాయిస్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ వన్నెల ఎల్లన్న , మద్ది రామచందర్ గారు తమ జీవితాలను సమాజ సేవకు అంకితం చేసిన మహనీయులని పేర్కొన్నారు. ముఖ్యంగా వన్నెల ఎల్లన్న రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడుతూ బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం జీవితాంతం కృషి చేశారని గుర్తు చేశారు. కులాలకు అతీతంగా సామాజిక న్యాయం కోసం పోరాడిన నాయకుడిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు.
అలాగే మద్ది రామచందర్ ఆదివాసి నాయకపోడ్ సమాజ అభ్యున్నతికి నిరంతరం కృషి చేసిన నాయకుడని, ఆయన సేవలను నేటి తరం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సమాజ అభివృద్ధి కోసం పని చేసిన నాయకులను ప్రతి సంవత్సరం స్మరించుకోవడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
కార్యక్రమంలో పల్ల సత్యనారాయణ, పెళ్లి శ్రీనివాస్, సిద్దుల సత్యనారాయణ, తమ్మల గంగన్న తదితరులు పాల్గొన్నారు. వారు నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
సమాజ అభ్యున్నతి కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను యువత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా నాయకులు పిలుపునిచ్చారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
