మన భారత్, హైదరాబాద్:
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆదివారం హైదరాబాద్లోని Parade Ground లో నిర్వహించిన బీజేపీ భారీ బహిరంగ సభలో భావోద్వేగానికి గురయ్యారు. తనపై రాజకీయ ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని పేర్కొంటూ ప్రసంగం మధ్యలో కంటతడి పెట్టుకున్నారు.
ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ “జై శ్రీరామ్” నినాదంతోనే తెలంగాణలో గడీలను బద్దలుకొట్టామని అన్నారు. అదే నినాదంతో పశ్చిమ బెంగాల్లో బీజేపీ విజయం సాధించిందని, తెలంగాణలో కూడా బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
తాము సనాతన ధర్మం కోసం పనిచేస్తున్నామని, తమ ధర్మాన్ని ఎవరైనా కించపరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. “జై శ్రీరామ్ అంటే కడుపు నిండుతుందా అని కొందరు విమర్శించారు. కానీ అదే నినాదం మాలో పోరాట స్ఫూర్తిని నింపింది” అని వ్యాఖ్యానించారు.
రాజకీయంగా ఎదుర్కోలేకే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. “పార్టీకి తలవంపులు తెచ్చే పనులు నేను చేయను. భయపడడానికి నేను ఫామ్హౌస్లో ఉండే ఎలుకను కాను” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీల పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. రైతుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
బీజేపీ నేతలు అంతర్గత భేదాభిప్రాయాలను పక్కనపెట్టి తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో బీజేపీ బలపడుతోందని, కార్యకర్తలు మరింత కష్టపడాలని సూచించారు.
పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఎదుగుదల తేలికగా రాలేదని, అక్కడ వందలాది కార్యకర్తలు ప్రాణత్యాగాలు చేశారని అన్నారు. కేరళలో కూడా బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగాయని పేర్కొన్నారు. దేశ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, నిధులు ఇచ్చేది కూడా కేంద్ర ప్రభుత్వమేనని చెప్పారు.
పరేడ్ గ్రౌండ్ సభలో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆయన భావోద్వేగ ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపిందని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
