మన భారత్, తలమడుగు:
ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి గ్రామ పంచాయతీల పాత్ర కీలకమని సుంకిడి సర్పంచ్ నర్సమ్మ పేర్కొన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో శుక్రవారం జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ వేడుకలో సర్పంచ్ నర్సమ్మ మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలు ప్రజాస్వామ్యానికి పునాది వంటివని, గ్రామ స్థాయి పాలన బలంగా ఉంటేనే దేశం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధి సాధ్యమవుతుందని, స్థానిక సమస్యలను స్థానికంగానే పరిష్కరించుకోవడం పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.
గ్రామ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి పాత్ర ముఖ్యమని, పారదర్శక పాలన ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని తెలిపారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి, శుభ్రత, తాగునీరు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలపై పంచాయతీలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అజయ్, మగ్గిడి ప్రకాశ్, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థ ప్రాముఖ్యతపై అవగాహన కల్పిస్తూ గ్రామాభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా గ్రామస్థుల్లో ప్రజాస్వామ్య విలువలపై చైతన్యం పెంపొందించేందుకు పలు కార్యక్రమాలు నిర్వహించడం విశేషం.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
