మన భారత్, ఆదిలాబాద్:
రాష్ట్రంలోని రైతులు, ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి పలు కీలక అంశాలపై మాజీ ఎంపీ, మాజీ ఎమ్మెల్యే, రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సోయం బాపూరావు వ్యవసాయ మార్కెటింగ్, సహకార, చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ను హైదరాబాద్లోని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జొన్నల కొనుగోలు వెంటనే ప్రారంభించాలని సోయం బాపూరావు మంత్రిని కోరారు. రైతులు పండించిన పంటలకు సరైన మద్దతు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇచ్చి రైతులను ఆదుకోవాలని సూచించారు.
అదేవిధంగా వెనుకబడిన బోథ్ నియోజకవర్గంలో ఆదివాసీలు అధిక సంఖ్యలో ఉన్నారని, వారి అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వివరించారు.
మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వర్ రావు ఈ అంశాలపై సానుకూలంగా స్పందిస్తూ, రైతుల సమస్యలను పరిష్కరించేందుకు మరియు ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సోయం బాపూరావు తెలిపారు.
ఈ సమావేశంలో మాజీ డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
