మన భారత్, తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థులకు ఎప్పటికప్పుడు ఎదురుచూస్తున్న సమ్మర్ హాలిడేస్కు గ్రీన్ సిగ్నల్ లభించింది. రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఒంటిపూట పాఠశాలలు కూడా ఈ నెల 23తో ముగియనున్నాయి.
ఈ సంవత్సరం మార్చి మొదటి వారంనుంచే ఎండల తీవ్రత అసాధారణంగా పెరగడంతో ముందస్తుగా సెలవులు ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఒకే విధంగా ఈ సెలవులు వర్తించనున్నాయి.
ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు మొత్తం 48 రోజులపాటు విద్యార్థులకు వేసవి సెలవులు లభించనున్నాయి. జూన్ 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం అవుతాయి. అదే రోజు నుంచి 2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది.
వేసవి సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా పట్టణాల్లో చదువుకుంటున్న పిల్లలు తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. కుటుంబాలతో సమయం గడిపేందుకు ఈ సెలవులు ఉపయోగపడతాయని భావిస్తున్నారు.
విద్యాశాఖ పాఠశాలలకు కొన్ని ముఖ్య సూచనలు జారీ చేసింది. విద్యా సంవత్సరం ముగిసేలోపు విద్యార్థులకు భద్రతా చర్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించింది. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో బయట తిరగకూడదని తెలియజేయాలని పేర్కొంది.
అదేవిధంగా వేసవి సెలవుల సమయంలో పిల్లలు సముద్రాలు, నదులు, చెరువులు, సరస్సులు వంటి నీటి వనరుల వద్దకు వెళ్లకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిల్లలపై నిరంతర పర్యవేక్షణ అవసరమని అధికారులు హెచ్చరించారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
