మన భారత్, ఆదిలాబాద్ రూరల్:
ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలం గోండు గూడలో ఆదివాసీ టూరిజం ఎక్స్పోజర్ ప్రోగ్రామ్ ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, ఆదివాసీ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్ గారు ముఖ్యంగా పాల్గొని మంత్రిని శాలువాతో సత్కరించారు. అనంతరం మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్, ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షుడు నరేష్ జాదవ్, మాజీ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాతలతో కలిసి కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సాజిద్ ఖాన్ మాట్లాడుతూ, అడవుల్లో నివసిస్తున్న ఆదివాసీ ప్రజలకు బయటి ప్రపంచంపై సరైన అవగాహన లేనివారు ఇంకా ఉన్నారని తెలిపారు. కొంతమందికి జిల్లా కేంద్రం గురించి కూడా తెలియని పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ ప్రజలను హైదరాబాద్ వంటి నగరాలకు తీసుకువెళ్లి పర్యాటక, విద్యా ప్రదేశాలను చూపించడం ఎంతో అవసరమని అన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు ఆలోచనతో ప్రభుత్వం చేపట్టిన ఈ టూరిజం ఎక్స్పోజర్ కార్యక్రమం ఆదివాసీలలో అవగాహన పెంచడంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడంలో కీలకంగా మారుతుందని సాజిద్ ఖాన్ అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమం ద్వారా ఆదివాసీ సమాజం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడం ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలను ప్రాచుర్యం చేయడంలో కూడా ముఖ్య పాత్ర పోషిస్తుందని అన్నారు.
