మన భారత్ | తెలంగాణ:
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మిక సంఘాల సమ్మె ప్రభావం రోజురోజుకూ తీవ్రంగా కనిపిస్తోంది. మంగళవారం రాత్రి ప్రభుత్వం మరియు కార్మిక సంఘాల మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో కార్మికులు సమ్మెబాట పట్టారు. అర్ధరాత్రి నుంచే రాష్ట్రవ్యాప్తంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి.
ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర, ఖమ్మం డిపోల్లో ఆర్టీసీ బస్సులు పూర్తిగా నిలిచిపోయాయి. ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. కార్మికులు డిపోల ఎదుట కూర్చొని నిరసనలు వ్యక్తం చేస్తూ తమ డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. సమ్మెను కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు.
బస్సులు రోడ్లపైకి రాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు, విద్యార్థులు గమ్యస్థానాలకు చేరుకునేందుకు ఇబ్బంది పడుతున్నారు. ప్రత్యామ్నాయ రవాణా కోసం ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తున్నప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వం పరిస్థితిని సమీక్షిస్తూ సమస్య పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు స్పష్టమైన నిర్ణయం వెలువడలేదు. సమ్మె ఎప్పుడు ముగుస్తుందనే అంశంపై అనిశ్చితి కొనసాగుతుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది.
రవాణా వ్యవస్థ సాధారణ స్థితికి రావాలంటే ప్రభుత్వం, కార్మిక సంఘాల మధ్య చర్చలు సఫలమవ్వాలని ప్రజలు కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి..
