మన భారత్ తలమడుగు:
రాష్ట్రంలో మీ సేవ (MeeSeva) సేవల చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచడంతో సామాన్య ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఇప్పటివరకు కనిష్టంగా రూ. 35గా ఉన్న సర్వీస్ ఛార్జీలను ఏకంగా రూ. 80కు పెంచుతూ ప్రభుత్వం తాజా జీవో జారీ చేసింది. ఈ పెంపుతో వివిధ సర్టిఫికెట్లు పొందేందుకు ప్రజలు మరింత ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వ పథకాల లబ్ధి పొందేందుకు ఆదాయ, నివాస, కులం వంటి సర్టిఫికెట్లు తప్పనిసరి కావడంతో ఈ చార్జీల పెంపు నేరుగా సామాన్యులపై ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా విద్యార్థులు, నిరుద్యోగులు తరచుగా ఈ సర్టిఫికెట్లు అవసరం పడుతుండటంతో వారి ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
సర్వీస్ ఛార్జీలను నామమాత్రంగా కాకుండా 50 శాతానికి పైగా పెంచడంపై ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఖజానాను నింపేందుకు ఈ విధంగా చార్జీలను పెంచడం సరైన నిర్ణయం కాదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒక్కసారిగా చార్జీలు భారీగా పెరగడంతో మీ సేవ కేంద్రాల వద్ద ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. సామాన్య ప్రజల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని చార్జీలను తగ్గించాలని కోరుతున్నారు.
మీ చుట్టుపక్కల వార్తలు పంపేందుకు క్రింద ఉన్న వాట్సాప్ నెంబర్ పై క్లిక్ చేయండి.
