న్యూఢిల్లీ,మన భారత్:
దేశవ్యాప్తంగా సిమెంట్ ధరలు మరలా పెరగనున్నాయి. రేపటి నుంచి సిమెంట్ బస్తా ధరలు రూ.30 నుంచి రూ.50 వరకు పెరిగే అవకాశం ఉందని డీలర్లకు కంపెనీలు సమాచారం అందించినట్లు తెలుస్తోంది. దీంతో నిర్మాణ రంగంపై మరింత భారం పడనున్నది.

వివరాల ప్రకారం, ప్రధాన సిమెంట్ తయారీ సంస్థలు ఇవాళ్టి నుంచే పాత ధరలపై బుకింగ్స్ను నిలిపివేశాయి. నిన్నటి వరకు మాత్రమే పాత రేట్లపై ఆర్డర్లు స్వీకరించగా, ఇకపై కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. పెరిగిన ధరలతో ప్రముఖ కంపెనీల సిమెంట్ బస్తా ధరలు రూ.360 వరకు చేరే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

ఇటీవల కాలంలో ముడి సరుకుల ధరలు, రవాణా ఖర్చులు, ఇంధన ధరలు పెరగడం వల్ల సిమెంట్ కంపెనీలు ధరలు పెంచే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ ధరల పెరుగుదల వల్ల గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగాలపై ప్రభావం పడనుంది.
ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణం చేపట్టడంలో మరింత ఖర్చు భరించాల్సి వస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఇసుక, ఇనుము ధరలు పెరిగిన నేపథ్యంలో సిమెంట్ ధరలు కూడా పెరగడం నిర్మాణ వ్యయాన్ని గణనీయంగా పెంచనుంది.

ఇదిలా ఉంటే, కొన్ని ప్రాంతాల్లో డీలర్లు స్టాక్ను నిల్వ ఉంచుతూ కొత్త ధరలపై విక్రయాలకు సిద్ధమవుతున్నారని సమాచారం. ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

