మన భారత్,ఆదిలాబాద్:
కాంగ్రెస్ పార్టీకి బలోపేతం అవసరమని, దేశానికి శక్తివంతమైన నాయకత్వం కావాలని పేర్కొంటూ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలని కాంగ్రెస్ కార్యకర్త గుడిపల్లి నగేష్ పిలుపు నిచ్చారు. అదే సమయంలో ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి తాను స్వచ్ఛందంగా రాజీనామా చేసినట్లు ప్రకటించారు.

తన రాజీనామాపై వస్తున్న వివిధ ఊహాగానాలను ఖండిస్తూ నగేష్ స్పష్టం చేశారు. “నా రాజీనామాకు ఎలాంటి విభేదాలు లేదా ఒత్తిళ్లు కారణం కావు. కొత్త కార్యకర్తలకు అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను” అని తెలిపారు.

పట్టణ అధ్యక్ష పదవి మూడు సంవత్సరాలకు ఒకసారి మార్పు జరగాలని, అలా చేస్తే పార్టీకి కొత్త నాయకత్వం, ఉత్సాహం వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. తాను ఐదు సంవత్సరాల పాటు బాధ్యతలు నిర్వహించిన తర్వాతే రాజీనామా చేస్తున్నానని పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఐదు నెలల క్రితమే టీపీసీసీ ఇంచార్జ్ తాహిర్ బిన్ హందాని కి లిఖితపూర్వకంగా తెలియజేసినట్లు వెల్లడించారు.
కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి కార్యకర్తకు అవకాశం రావాలని, యువత ముందుకు రావాలని ఆయన ఆకాంక్ష వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే ఉంటానని స్పష్టం చేశారు.

“జై కాంగ్రెస్, జై హింద్, జై భారత్” అంటూ తన సందేశాన్ని ముగించారు.
ఈ ప్రకటనతో ఆదిలాబాద్ కాంగ్రెస్ రాజకీయాల్లో కొత్త చర్చ ప్రారంభమైంది. కొత్త పట్టణ అధ్యక్షుడి ఎంపికపై ఆసక్తి నెలకొంది.

