మన భారత్: అదిలాబాద్ :
జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ఉందన్న పుకార్లను ప్రజలు నమ్మవద్దని పెట్రోల్ బంక్ యజమాని, సామాజిక కార్యకర్త ముడుపు మౌనిష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రజలకు స్పష్టత ఇచ్చారు. జిల్లాలో ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా సజావుగా కొనసాగుతోందని మౌనిష్ రెడ్డి తెలిపారు. కొందరు అసత్య ప్రచారాలు చేయడం వల్ల ప్రజల్లో అనవసర భయం నెలకొంటోందని అన్నారు.

వినియోగదారులు అవసరానికి మించిన పెట్రోల్ కొనుగోలు చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. అవసరానికి మించి నిల్వ చేసుకోవడం వల్లే కృత్రిమ కొరత ఏర్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఇదిలా ఉండగా, జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని, ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.

ప్రజలు పుకార్లను నమ్మకుండా, అధికారిక సమాచారం మాత్రమే విశ్వసించాలని ఆయన కోరారు. ఇంధన సరఫరా వ్యవస్థ పటిష్టంగా ఉందని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని భరోసా ఇచ్చారు.

