మన భారత్: అదిలాబాద్:
అదిలాబాద్ పట్టణంలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఉన్న స్వయంభు గణపతి ఆలయంలో చోరీ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది. ఆలయంలోని హుండీని దుండగులు పగలగొట్టి నగదు అపహరించినట్లు భక్తులు గమనించారు.

బుధవారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు హుండీ దొంగతనం జరిగినట్లు గుర్తించి వెంటనే ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఆలయ కమిటీ సభ్యులు జాదవ్ శ్రావణ్ నాయక్, భాస్కర్ గౌడ్ వెంటనే 100 డయల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ట్రైనీ ఎస్పీ రాహుల్ కాంత్, ఎస్హెచ్ఓ మావల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.

దుండగులను త్వరలోనే గుర్తించి అరెస్ట్ చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. ఆలయ పరిసరాల్లో సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తూ, అన్ని కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ ఘటనతో స్థానికంగా భద్రతపై చర్చ మొదలైంది. ఆలయాల్లో భద్రతా చర్యలు మరింత బలోపేతం చేయాలని భక్తులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కాంగ్రెసు పార్టీ యువనాయకులు శ్రావణ్ నాయక్, భాస్కర్ గౌడ్, ఠాగూర్, వెంకట్ రెడ్డి, సంతోష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

