మన భారత్, తలమడుగు:
మండల కేంద్రంలో దివ్యాంగుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరుతూ దివ్యాంగుల సంఘం నాయకులు స్థానిక అధికారులకు వినతిపత్రం సమర్పించారు. అర్హులైన ప్రతి దివ్యాంగుడికి అంత్యోదయ రేషన్ కార్డులు తక్షణమే మంజూరు చేయాలని, అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా చేరేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

దివ్యాంగులకు ఇందిరమ్మ ఇళ్ల పథకం సహా అన్ని ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి శాఖలో కనీసం ఐదు శాతం రిజర్వేషన్ కచ్చితంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అదేవిధంగా ఎమ్మార్వో, ఎంపీడీవో కార్యాలయాలు, ప్రభుత్వ పాఠశాలల్లో దివ్యాంగులకు అనుకూలంగా రాంపులు ఏర్పాటు చేయాలని సూచించారు.

ఉపాధి హామీ పథకం కింద దివ్యాంగులకు గ్రామ శివారుల్లో పనులు కల్పించాలని కోరుతూ స్థానిక ఎంపీడీవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో స్పందిస్తూ, అర్హులైన దివ్యాంగులకు అంత్యోదయ కార్డులు వీలైనంత త్వరగా అందించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో తలమడుగు మండల దివ్యాంగుల సంఘం అధ్యక్షుడు ప్రసాద్, సభ్యులు కొయ్యల రాకేష్, రవికాంత్, సత్యనారాయణ, షేక్ బాబు తదితరులు పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరారు.

