మన భారత్, తెలంగాణ:
ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి చలాన్లు చెల్లించకుండా వదిలేసే వాహనదారులపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. సకాలంలో చలాన్లు చెల్లించని వారికి డ్రైవింగ్ లైసెన్స్ (DL), వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC)లను ఫ్రీజ్ చేసే విధంగా కొత్త నిబంధనలను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు త్వరలోనే అధికారిక నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

ప్రతిపాదిత నిబంధనల ప్రకారం, ఒక వాహనదారునికి ఏడాదిలో 5 కంటే ఎక్కువ చలాన్లు ఉండి, అవి చెల్లించకపోతే కఠిన చర్యలు తీసుకుంటారు. ఇలాంటి సందర్భాల్లో సంబంధిత వాహనదారుల DL, RCలను తాత్కాలికంగా నిలిపివేసే అవకాశం ఉంది. దీంతో ట్రాఫిక్ ఉల్లంఘనలపై నియంత్రణ సాధించడమే లక్ష్యంగా అధికారులు చెబుతున్నారు.

అలాగే, చలాన్లపై వాహనదారులు వ్యక్తం చేసే అభ్యంతరాలను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ‘గ్రీవెన్స్ రెడ్రెసల్ అథారిటీ’ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ వ్యవస్థ ద్వారా వాహనదారులు తమ ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చు. తద్వారా అనవసర చలాన్లు, సాంకేతిక లోపాలపై త్వరితగతిన స్పందించే అవకాశం ఉంటుంది.

ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించేలా ప్రజల్లో అవగాహన పెంపొందించడమే ఈ చర్యల ప్రధాన ఉద్దేశ్యంగా ప్రభుత్వం పేర్కొంటోంది. కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే, చలాన్లు పెండింగ్లో ఉంచే వాహనదారులపై గట్టి ప్రభావం పడే అవకాశం ఉంది.

