మన భారత్, తెలంగాణ:
ప్రపంచ ప్రఖ్యాత మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరపై కావాలనే తప్పుడు ప్రచారం జరుగుతోందని తెలంగాణ మంత్రి సీతక్క తీవ్రంగా మండిపడ్డారు. కొంతకాలంగా జాతర స్వరూపాన్ని వక్రీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటి వెనుక ఉద్దేశపూర్వక కుట్ర ఉందని ఆమె ఆరోపించారు.
ఇటీవల మేడారం జాతరకు అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా పట్టణాలకు చెందిన చదువుకున్న వర్గాలు కూడా పెద్ద సంఖ్యలో హాజరవుతున్నారని మంత్రి సీతక్క తెలిపారు. ఈసారి జాతరకు మరింత ఎక్కువ మంది ‘హైక్లాస్’ ప్రజలు వచ్చారని పేర్కొన్నారు. ఇది కొంతమందికి జీర్ణించుకోవడం లేదని ఆమె వ్యాఖ్యానించారు.
“అక్కడేముంది.. ఊరుదేవుళ్లే కదా” అంటూ జాతర ప్రాధాన్యాన్ని తగ్గించేలా వ్యాఖ్యలు చేసిన కొందరు పూజారులు, పీఠాధిపతులు ఈ మార్పును సహించలేకపోతున్నారని మంత్రి సీతక్క అన్నారు. వారి వెనుక కొన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయని కూడా ఆమె ఆరోపించారు.
మేడారం జాతరపై తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం జరుగుతోందని, కొన్ని మీడియా సంస్థలు, యూట్యూబ్ ఛానళ్ల ద్వారా విషప్రచారం సాగుతోందని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. జాతర విశిష్టతను, గిరిజన సంప్రదాయాలను దెబ్బతీసేలా వ్యవహరించడాన్ని ప్రభుత్వం సహించదని స్పష్టం చేశారు.
మేడారం జాతర అనేది కేవలం ఒక ప్రాంతీయ ఉత్సవం మాత్రమే కాదని, కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని మంత్రి సీతక్క గుర్తు చేశారు. జాతర పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, తప్పుడు ప్రచారాలకు ప్రజలు చెవివేయొద్దని ఆమె కోరారు.
