చలికాలంలో వర్షం.. నెల్లూరులో అకస్మాత్తుగా మారిన వాతావరణం
మన భారత్, ఆంధ్రప్రదేశ్ : ఏపీ రాష్ట్రం నెల్లూరు నగరంలో చలికాలంలోనే వర్షం కురవడం నగరవాసులను ఆశ్చర్యానికి గురిచేసింది. సోమవారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారిపోయి సుమారు సాయంత్రం 5.30 గంటల ప్రాంతంలో వర్షం ప్రారంభమైంది. గంటపాటు కురిసిన వర్షంతో నగరంలోని పలు ప్రాంతాలు తడిసి ముద్దయ్యాయి.
వర్షం కారణంగా కాలువల్లోని మురుగు నీరు రోడ్లపైకి చేరడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రధాన రహదారులతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కార్యాలయాల నుంచి ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు వర్షం వేళ రోడ్లపై చిక్కుకుని ఇబ్బందులు పడ్డారు.
చలికాలంలో ఇలాంటి వర్షం పడటం అరుదైన పరిణామమని నగరవాసులు పేర్కొన్నారు. వాతావరణంలో మార్పులు పెరుగుతున్న నేపథ్యంలో అనూహ్య వర్షాలు పడుతున్నాయని పలువురు అభిప్రాయపడ్డారు. వర్షం తగ్గినప్పటికీ రోడ్లపై నీరు నిలిచిపోవడం వల్ల రాకపోకలు కొంతసేపు మందగించాయి.
