దేవాపూర్–కమలాపూర్ మార్గంలో బ్రిడ్జ్ మంజూరు చేయాలి: ఎంపీ గోడం నగేష్కు దేవాపూర్ గ్రామస్తుల వినతి
మన భారత్, ఆదిలాబాద్:
ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని దేవాపూర్ గ్రామం నుంచి కమలాపూర్కు వెళ్లే ప్రధాన మార్గంలో వంతెన (బ్రిడ్జ్) నిర్మాణం అత్యవసరమని కోరుతూ దేవాపూర్ గ్రామస్తులు ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ గోడం నగేష్ ని మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ, దేవాపూర్–కమలాపూర్ మార్గంలో బ్రిడ్జ్ లేకపోవడం వల్ల ముఖ్యంగా వర్షాకాలంలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వర్షాలు పడిన వెంటనే చేనులోకి వెళ్లాలంటే ప్రాణాపాయం తప్పదని, ఏరువులు తీసుకెళ్లడం, ఎడ్లబండ్లు వెళ్లడం కూడా అసాధ్యంగా మారిందని తెలిపారు. దీంతో పంటల సంరక్షణ, వ్యవసాయ పనులు సకాలంలో చేయలేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
దేవాపూర్ గ్రామ రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మానవతా దృక్పథంతో స్పందించి ఈ మార్గంలో బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేయాలని ఎంపీ గోడం నగేష్ ని కోరారు. ఈ సమస్య పరిష్కారమైతే వందలాది ఎకరాల వ్యవసాయ భూములకు సురక్షిత రాకపోకలు ఏర్పడి రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో దేవాపూర్ గ్రామ సర్పంచ్ పోరండ్ల సంతోష్ , బీజేవైఎం మండల అధ్యక్షులు దాతజీ కిరణ్, ఎంబడి రఘు, శానం శ్రీనివాస్, ఎంబడి సంతోష్, రేగుల మోహన్, ఓస రవి, ఎంబడి పోశెట్టి, తోకల సంతోష్, కాకేర్ల భూమన్న, లస్మ రెడ్డి, గుమ్ముల నర్సయ్య, సుధాకర్ రెడ్డి, నజీర్ ఖాన్ పెద్ద సంఖ్యలో దేవాపూర్ గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎంపీ గోడం నగేష్ గ్రామస్తుల విజ్ఞప్తిని సానుకూలంగా పరిశీలిస్తానని, సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
