సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా జరుపుకుందాం
– రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే పిలుపు
మన భారత్, ఆదిలాబాద్:
భారతదేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు, క్రాంతి జ్యోతి సావిత్రిబాయి పూలే 195వ జయంతిని జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించాలని అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతిని అధికారికంగా **“మహిళా ఉపాధ్యాయ దినోత్సవం”**గా ప్రకటించి జరుపుకుంటున్న నేపథ్యంలో, ఈ నిర్ణయానికి అఖిల భారతీయ మాలీ మహా సంఘం తరపున రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని యాజమాన్యాల పాఠశాలల్లో సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాంబన్న శేండేతో కలిసి సుకుమార్ పేట్కులే పిలుపునిచ్చారు. మహిళా విద్య, సామాజిక సంస్కరణల కోసం సావిత్రిబాయి పూలే చేసిన సేవలు తరతరాలకు స్ఫూర్తిదాయకమని వారు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ ఆవరణలో గల ఫూలే దంపతుల చిత్రపటాలకు మాలి ఎంప్లాయిస్ యూనియన్, సావిత్రిబాయి పూలే మహిళా మండలి సభ్యులు పూలమాలలు వేసి, కొవ్వొత్తులు వెలిగించి ఘనంగా నివాళులు అర్పించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా ఫూలే దంపతుల సేవలను ప్రజల్లో మరింత విస్తృతంగా చాటి చెప్పాలనే ఉద్దేశం ఉందని వెల్లడించారు.
ఇదే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్తమ సేవలందిస్తున్న పది మంది మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించాలంటూ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, వాటిని సమర్థంగా అమలు చేస్తున్న జిల్లా కలెక్టర్కు, జిల్లా విద్యాశాఖ అధికారులకు హిందీ భాష సేవా సమితి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాలి ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ అంబేద్కర్, కార్యవర్గ సభ్యులు దేవిదాస్ తదితరులు పాల్గొని జయంతి కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
