చలి తీవ్రత పెరుగుతోంది.. జాగ్రత్తలు తప్పనిసరి: వైద్యుల హెచ్చరిక
మన భారత్, హైదరాబాద్:
గత నెల రోజులుగా జిల్లాలో రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ముఖ్యంగా గత వారం రోజులుగా మరింతగా చలి పెరగడంతో ఆరోగ్యపరమైన ప్రమాదాలు అధికమవుతున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిర్లక్ష్యం ప్రాణాంతకంగా మారే అవకాశముందని వారు స్పష్టం చేస్తున్నారు.
వైద్యుల సూచనల ప్రకారం, మధ్య వయస్సు వారు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు సూర్యోదయానికి ముందు, అలాగే సాయంత్రం ఆరు గంటల తర్వాత బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలి. చలి తీవ్రత వల్ల గుండె, ఊపిరితిత్తుల సమస్యలు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు.
చలికాలంలో చలిమంటల వద్ద కూర్చోవడం కూడా ప్రమాదకరమని వైద్యులు సూచిస్తున్నారు. కట్టెలు మండుతుండగా వెలువడే పొగలో కార్బన్ మోనాక్సైడ్ వంటి హానికర వాయువులు ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలు, అకస్మాత్తుగా ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా మూసివేసిన గదుల్లో చలిమంటలు పెట్టడం మరింత ప్రమాదకరమని తెలిపారు.
జాగ్రత్తలు పాటించాలి
ఉష్ణోగ్రతలు పడిపోతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు ఉదయం చలి ఎక్కువగా ఉండే సమయంలో బయటకు వెళ్లకూడదని, ఎండ పూర్తిగా వచ్చిన తర్వాతే బయటకు రావాలని సూచిస్తున్నారు. ఛాతిలో బరువుగా అనిపించడం, చేతులు లాగడం, అకస్మాత్తుగా చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని హెచ్చరిస్తున్నారు.
వాకింగ్కు వెళ్లే వారు కూడా ఉదయం ఎండ వచ్చిన తర్వాతే వాకింగ్ చేయడం ఉత్తమమని వైద్యులు సూచించారు. చలికాలంలో గోరువెచ్చని దుస్తులు ధరించడం, వేడి ఆహారం తీసుకోవడం, శరీరాన్ని చల్లగా మారనీయకుండా చూసుకోవడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. చలిని నిర్లక్ష్యం చేయకుండా ముందస్తు జాగ్రత్తలే ఆరోగ్య రక్షణకు కీలకమని వైద్యులు సూచిస్తున్నారు.
