నీటి సమస్యకు విద్యార్థుల నిరసన… వెంటనే స్పందించిన అధికారులు.!
మన భారత్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా: ములకలపల్లిలో గిరిజన ఏకలవ్య మోడల్ పాఠశాలలో విద్యార్థులు నీటి కొరతపై చేపట్టిన నిరసనకు అధికారులు వెంటనే స్పందించారు. జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశాల మేరకు సంబంధిత శాఖలు చర్యలు ప్రారంభించాయి.
పాఠశాలలో నీటి సరఫరా సమస్య పరిష్కారానికి తక్షణ ఏర్పాట్లు చేయబడ్డాయి. సీపీడబ్ల్యూడీ విద్యుత్ అధికారులు అవసరమైన చేంజ్ ఓవర్ స్విచ్ ను విజయవాడ నుండి కొనుగోలు చేసి, ఆదివారం నాటికి ఫిట్టింగ్ పూర్తి చేయనున్నట్లు తెలిపారు.
అశ్వరావుపేట ఎమ్మెల్యే అధినారాయణ కూడా విద్యార్థుల సమస్యపై స్పందించి, నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కొత్త బోరు వేయిస్తానని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ అధికారులు ఇప్పటికే కనెక్షన్ అందజేసినట్లు సమాచారం.
గిరిజన గురుకులాల ప్రాంతీయ అధికారి (RCO) విద్యార్థులతో మాట్లాడి, వారి సమస్యలపై పాఠశాల సిబ్బందితో సమావేశం నిర్వహించారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ప్రాంతీయ అధికారి శ్రీమతి బి. అరుణకుమారి మాట్లాడుతూ, “ఇకముందు నీటి సమస్య, మెనూ సమస్యలు లేకుండా పాఠశాలలో అన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తాం” అని పేర్కొన్నారు.
ఈ నివేదికను అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయం, భద్రాచలం ద్వారా విడుదల చేశారు.
